3 min

రోమశ మహర్షి జీవిత విశేషాలు

XPatrika Editorial
రోమశ మహర్షి జీవిత విశేషాలు

01రోమశ మహర్షి జీవిత విశేషాలు

రోమశ మహర్షి గురించి మరి మొదలు పెట్టండి ... ! రోమశుడు చిన్నప్పటి నుంచే బ్రహ్మచర్యంతో వుండి తపస్సు చేసి ఆత్మజ్ఞానం పొందాడు . అతడు భూమి మీదున్న అన్ని తీర్థాల్లో స్నానం చేసి , అందరు దేవతల దర్శనం చేసుకుని భూలోకంలోనూ , స్వర్గ లోకంలోనూ స్వేచ్ఛగా తిరగగలిగే శక్తిని కూడ పొందాడు . ఒకసారి రోమశుడు ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుడి పక్కన కూర్చున్న అర్జునుణ్ణి ఆశ్చర్యంగా చూశాడు . అర్జునుణ్ణి రోమశుడికి పరిచయం చేశాడు ఇంద్రుడు . అర్జునుడు వచ్చి రోమశుడికి సాష్టాంగనమస్కారం చేశాడు . తర్వాత ఇంద్రుడు భూలోకం వెళ్ళి అర్జునుడు తన దగ్గర ఉన్నట్లుగా ధర్మరాజుకి చెప్పి , అన్ని తీర్థాల విశేషాలు చెప్పి ధర్మరాజుని అన్ని తీర్ధాల్లోనూ స్నానం చేసేటట్లు చూసి పవిత్రుడుగా చెయ్యమని రోమశ మహర్షిని ప్రార్థించాడు . ఇంద్రా ! పాండవులకి మంచి చెయ్యడం కంటే కావల్సిందేముంది అని బయలుదేరి ధర్మరాజు దగ్గరికెళ్ళి జరిగింది చెప్పి తీర్థయాత్రలకి రమ్మని తీసుకెళ్ళాడు రోమశ మహర్షి . కామ్యకవనంలో వున్న బ్రాహ్మణులు , సోదరులు , ద్రౌపది అందరితో కలిసి బయలుదేరాడు ధర్మరాజు . రోమశుడు ధర్మాల్ని గురించి చెప్తూ పాండవుల్ని నైమిశం , అశ్వతీర్థం , గంగాఘోషం , కన్యాతీర్థం , గోమతి , భాహుద , మహానదులు , ప్రయాగ , గంగా యమునా సంగమం మొదలైన తీర్థాలన్నిట్లో స్నానం చేయించి ఆవు , బంగారం దానం ఇప్పించాడు . ఎంతో మంది మహర్షుల చరిత్రలు కూడ వినిపించాడు రోమశుడు . తర్వాత గంథమాదన పర్వత ప్రాంతంలో నడవడానికి వీలులేక పోవడంతో భీముడు ఘటోత్కచుణ్ణి పిలిపించాడు . ఘటోత్కచుడు పాండవుల్ని , ధౌమ్యుడ్ని , ద్రౌపదిని ఎత్తుకుని మిగిలిన వాళ్ళని రాక్షసులతో ఆకాశమార్గంలో గంగా తీరంలో వున్న నరనారాయణాశ్రమానికి తీసుకువచ్చాడు . రోమశుడు మాత్రం తన తపశ్శక్తితో చేరుకున్నాడు . అక్కడ ఆరు రోజులుండి అన్ని పుణ్యక్షేత్రాలు చూశారు . అక్కడ ఇంద్రుడు అర్జునుణ్ణి పాండవులకి అప్పగించాడు . అందరూ కలిసి రోమశుడితో ఆరేళ్ళు గడిపి ధర్మ రహస్యాలన్నీ తెలుసుకున్నారు . పూర్వం వేదనిధి అనే బ్రాహ్మణ కుమారుణ్ణి గంధర్వ కన్యలు ప్రేమించారు . కానీ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న అతడు అందుకు అంగీకరించలేదు . అందుకని గంధర్వ కన్యలు అతని మీద పడి అతడ్ని మార్చాలనుకున్నారు . వేదనిధి వాళ్ళని పిశాచాలయి పొమ్మని శపించాడు . వాళ్ళు అతన్ని కూడా పిశాచంగా శపించారు . వేదనిధి గంధర్వ కన్యలు కూడా పిశాచాలుగా మారిపోయారు . వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుతూ వచ్చి రోమశముని పాదాలమీద పడి వాళ్ళెక్కడున్నారో చెప్పమని ప్రార్థించారు . బాధపడకండి అందరూ నాతో వచ్చి మాఘస్నానం చెయ్యండి . మాఘమాసంలో తీర్థస్నానం చేస్తే సప్తజన్మల పాపం పోతుంది . ప్రయాగలో మాఘస్నానం చేసిన వీరసేనుడు భద్రకుడు గురించి చెప్తాను వినమన్నాడు రోమశ మహర్షి . రోమశ మహాముని దేవద్యుతి కథ వేదనిధికిలా చెప్పాడు . సరస్వతీ నదీ తీరంలో ' యక్షవ్రస్రణ ' అనే పర్వతం వుంది . సుమిత్రముని కొడుకు దేవద్యుతి వేసవికాలంలో నిప్పుల్లోనూ , శీతాకాలంలో నీళ్ళల్లోనూ ఉండి గాలి , నీళ్ళు , కాయలు , దుంపలు తింటూ కఠోరమైన తపస్సు చేశాడు . తపస్సు వల్ల అతని తేజస్సు మూడులోకాల్లోను వ్యాపించింది . వైశాఖ శుద్ధ ఏకాదశినాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై తనని స్తోత్రం చేసిన మునిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు . తర్వాత పిశాచరూపంలో ఉన్న చిత్రసేనుడ్ని దేవద్యుతి ప్రయాగ స్నానం చేయించడం వల్ల అతని పిశాచజన్మ పోయింది . అలాగే మనం కూడ ప్రయాగ స్నానం చేస్తే నీ కొడుక్కి గంధర్వకన్యలకి కూడ శాప విమోచనం అవుతుందని చెప్పి వాళ్ళతో ప్రయాగలో స్నానం చేయించి వాళ్ళకి పూర్వపు రూపం వచ్చేలా చేశాడు రోమశమహర్షి . రోమశుడు ప్రయాగ గొప్పతనం ఇలా చెప్పాడు . ప్రయాగ తీర్థంలో బ్రహ్మయజ్ఞం చేశాడు . ఈపాయ పేరు ' అసితతోయవేణి ' . ఈ నీళ్ళు త్రాగిన వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది . విష్ణుమూర్తి దీంట్లో స్నానం చేసి లక్ష్మీదేవిని పొందాడు . ఊర్వశి శాపవిమోచనం పొందింది . ఇంద్రుడికి దీంట్లో స్నానం చేసిన తర్వాతే కొడుకు పుట్టాడు . నరనారాయణలు దీంట్లో మునిగి ఆకలిదప్పులు పోగొట్టుకున్నారు . కశ్యపుడు శివ దర్శనం చేసింది ఇక్కడే . భరద్వాజుడు ఇక్కడే తపస్సు చేసుకున్నది . సనకాదులు యోగసిద్ధి పొందింది కూడా ఇక్కడే . మోక్షం కావాలనుకున్న వాళ్ళకి మోక్షం , పనులు పూర్తవ్వాలనుకున్న వాళ్ళకి పనులు , సాధకులకి సిద్ధి దొరుకుతుందని చెప్పాడు.  ఈ రకంగా రోమశ మహర్షి అనేక తీర్థాల్లో స్నానం చేసి గొప్ప పవిత్రుడయ్యాడు . ఎంతో మందికి తీర్థయాత్రా విశేషాలు చెప్పాడు . ఇప్పటికీ భక్తితో తీర్ధయాత్రలు చేసే వాళ్ళకి రోమశ మహర్షి అక్కడ కనిపిస్తాడట .

Notes
  • Be the first to leave a note.